చివరి వరకు పోరాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా..ఓటర్ల జాబితాపై బీజేపీకి మమత సవాల్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది
By - Knakam Karthik |
చివరి వరకు పోరాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా..ఓటర్ల జాబితాపై బీజేపీకి మమత సవాల్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఓటు హక్కును హరించేందుకు కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో ఈద్ ప్రార్థనల అనంతరం వేలాది మంది భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR) పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించడం వెనుక రాజకీయ కుతంత్రం ఉందని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. "మోదీజీ, ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికి మేము అనుమతించము. ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పౌరుడి హక్కును కాపాడటానికి చివరి వరకు పోరాడుతాను" అని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
బెంగాల్ను లక్ష్యంగా చేసుకుని, ప్రజలను విభజించాలని చూసే శక్తులకు ఇక్కడ చోటు లేదని, అలాంటి వారు "నరకానికి పోవాలి" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్రంలోని మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఏ శక్తీ ప్రయత్నించినా తాము అడ్డుకుంటామని, బెంగాల్ ఎప్పటికీ ఐక్యంగానే ఉంటుందని మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు.