'ది కేరళ స్టోరీ' సినిమా చూసి.. బాయ్‌ఫ్రెండ్‌పై అత్యాచారం కేసు పెట్టిన యువతి

తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, మతం మారాలని ఒత్తిడి తెచ్చినందుకు ఇండోర్‌లో 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

By అంజి  Published on  23 May 2023 7:45 AM GMT
Madhya Pradesh, The Kerala Story, Crime news

'ది కేరళ స్టోరీ' సినిమా చూసి.. బాయ్‌ఫ్రెండ్‌పై అత్యాచారం కేసు పెట్టిన యువతి

తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, మతం మారాలని ఒత్తిడి తెచ్చినందుకు ఇండోర్‌లో 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. 'ది కేరళ స్టోరీ' చూసిన తర్వాత మహిళ ఆ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందనిపోలీసులు తెలిపారు. ‘పెళ్లి నెపంతో ప్రేమ ఉచ్చులో పడిన తర్వాత’ ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బాధితురాలు నాలుగేళ్ల క్రితం కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నప్పుడు నిందితుడు ఫైజాన్‌తో స్నేహం చేసింది. ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆ మహిళ అతనితో కలిసి జీవించడం ప్రారంభించింది. 12వ తరగతి వరకు చదివి నిరుద్యోగి అయిన నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని భావించి మతం మారాలని పదే పదే బలవంతం చేశాడు. మహిళ లొంగకపోవడంతో, అతను ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి, కొట్టాడు.

ఓ రోజు 'ది కేరళ స్టోరీ' చూద్దాం అని ఆ మహిళ తన ప్రియుడిని అడిగింది. చాలా సేపు ఒప్పించిన తర్వాత, నిందితుడు అయిష్టంగానే ఆమెతో సినిమా చూడటానికి అంగీకరించాడు. ఇద్దరూ సినిమా చూశారు. చివరకు ఆ మహిళ తనకు తానుగా నిలబడాలని నిర్ణయించుకుంది. సినిమా చూసిన తర్వాత ధైర్యం కూడగట్టుకున్న ఆమె తన ప్రియుడితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో అతనిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.

బలవంతంగా లేదా మోసం చేసి మత మార్పిడిని నిషేధించే మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2021, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) నిబంధనల ప్రకారం నిందితుడైన ఫైజాన్‌ను అరెస్టు చేసినట్లు ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దినేష్ వర్మ విలేకరులతో అన్నారు.

"తాను, ఆ వ్యక్తి ఇటీవల 'ది కేరళ స్టోరీ' చూడటానికి వెళ్లినట్లు ఆ మహిళ చెప్పింది. సినిమా చూసిన తర్వాత, ఇద్దరూ వాదించుకున్నారు. ఆ వ్యక్తి తనపై దాడి చేసి విడిచిపెట్టాడు. ఆమె మే 19 న పోలీసులను ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది" అని పోలీసులు తెలిపారు. అన్ని ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నామని దినేష్ వర్మ తెలిపారు. మే 5న థియేటర్లలో విడుదలైన 'ది కేరళ స్టోరీ' కేరళలోని మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ద్వారా రిక్రూట్ చేశారని సినిమాలో పేర్కొన్నారు.

విడుదలకు ముందే కంటెంట్‌పై వివాదాన్ని సృష్టించిన ఈ చిత్రం, వర్గాల మధ్య ఉద్రిక్తతకు భయపడి మే 8న పశ్చిమ బెంగాల్‌లో నిషేధించబడింది. తమిళనాడులోని థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటం, శాంతిభద్రతల పరిస్థితి కారణంగా మే 7 నుండి సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయించారు. మే 18న, రాష్ట్రంలో సినిమాను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించాలని తమిళనాడును కోరింది.

బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాఖండ్‌లలో ఈ చిత్రానికి పన్ను రహితంగా ప్రకటించారు .

Next Story