కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వైద్య నివేదికలో షాకింగ్ నిజాలు.!
కోల్కతాలోని బల్లిగంజ్లోని సౌత్ కలకత్తా లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
By Medi Samrat
కోల్కతాలోని బల్లిగంజ్లోని సౌత్ కలకత్తా లా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బాధితురాలి వైద్య నివేదిక అత్యాచారాన్ని నిర్ధారించింది. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య నివేదికలో బాధితురాలి శరీరంపై కోసిన గాట్లు, గోళ్లతో రక్కిన గీతలు, కొట్టిన గుర్తులు వైద్య నివేదికలో గుర్తించారు.
లా కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త, ఇద్దరు సీనియర్ విద్యార్థులతో కలిసి జూన్ 25 రాత్రి ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీ సిబ్బంది గదిలో ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలుస్తుంది.
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను గురువారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుల పేర్లు మనోజిత్ మిశ్రా, ప్రమిత్ ముఖోపాధ్యాయ, జెబ్ అహ్మద్. వారిలో మనోజిత్ ప్రధాన నిందితుడు. కళాశాల మాజీ విద్యార్థి నాయకుడు. ప్రస్తుతం కాలేజీలో తాత్కాలిక ఉద్యోగి కూడా.. అలీపూర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ కేసుల్లో న్యాయవాది.. ప్రమిత్, జెబ్ మూడవ సంవత్సరం కళాశాల విద్యార్థులు. నిందితుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని విచారిస్తున్నారు.
పోలీసులు కళాశాలలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. రాత్రి 7.30 గంటల నుంచి 10.50 గంటల వరకు తనను చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉటంకిస్తూ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోరిన్ ఘోషల్.. ఈ ఘటనను అత్యాచారంగా పరిగణించడం లేదని, సామూహిక అత్యాచారంగా పరిగణిస్తామన్నారు.
ఎందుకంటే ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడితే.. ఇతరులు అతనికి ఏ విధంగానైనా సహాయం చేస్తే వారు కూడా నిందితులుగా పరిగణించబడతారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి రహస్య వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.