కోల్కతా గ్యాంగ్రేప్ కేసు నిందితుడు మనోజిత్ మిశ్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాలేజీలోకి ప్రవేశించడానికి నిరాకరించినందుకు మనోజిత్ మిశ్రా కాలేజీ లైబ్రేరియన్పై దాడి చేసి సెక్యూరిటీ గార్డు చెవిపోగును పీకేసిన ఘటన కలకలం రేపగా.. తాజాగా NDTV నివేదిక ప్రకారం.. మనోజిత్ బ్యాచ్మేట్ మాట్లాడుతూ.. అతడు ప్రతిరోజూ సాయంత్రం కళాశాల యూనియన్ గదిలో కూర్చుని మద్యం సేవించేవాడు. అతడు యూనియన్ గదిని బార్గా మార్చాడు.. అతడి చర్యలను ఎవరూ ఎదిరించలేదరు.. ఎందుకంటే అందరూ అతనికి భయపడేవారని పేర్కొన్నాడు.
మనోజిత్పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాలేజీలో అమ్మాయిలను ఆటపట్టించడం అతని దినచర్య. కాలేజీ సిబ్బందిని కాల్చి చంపేస్తానని బెదిరించేవాడు. 2019 జూలైలో విద్యార్థి దుస్తులను చింపినందుకు అతనిపై కేసు నమోదైంది. మార్చి 2022లో స్విన్హో లేన్లో ఒక మహిళను వేధించాడని కూడా అతనిపై ఆరోపణలు వచ్చాయి. మనోజిత్ కాలేజీ ఆస్తులను పాడు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో మనోజిత్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. మనోజిత్ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. కాలేజీలో టీఎంసీ విద్యార్థి సంఘం నాయకుడు. కాలేజీలోని గార్డు గదిలో మనోజిత్ తన సహచరులతో కలిసి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అత్యాచార దృశ్యాలను వీడియో తీసి ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని వెల్లడించింది.