జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ వేడుకలో ఎం.చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇఎస్ జైరామ్ రాజీనామా చేశారు. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆర్సీబీ ట్రోఫీని గెలుచుకుంది, కానీ వేడుకల పరేడ్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. బెంగళూరులో జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ వేడుకలు విషాదకరమైన మలుపు తిరిగి 11 మంది అభిమానుల మరణానికి దారితీసిన తర్వాత, పోలీసులు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నలుగురిలో ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే కూడా ఉన్నారు.
ఇక సోషల్ యాక్టివిస్ట్ ఎ.ఎం.వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దర్యాప్తు చేస్తామని తెలిపారు. జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. కర్ణాటక పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకుండా RCB ఫ్రాంచైజీ, ఈవెంట్ కంపెనీ DNA, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ద్వారా ఈవెంట్ నిర్వహించబడింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్లోని అనేక సెక్షన్లు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు.