కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్-1'లోని ఒక పాత్రను అనుకరిస్తూ, దైవాన్ని కించపరిచారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు మార్చి 9వ తేదీ వరకు పొడిగించింది. రిషబ్ శెట్టి పోషించిన 'చావుండ' దైవం పాత్రను అనుకరిస్తూ, ఆ దైవాన్ని "దెయ్యం" (Ghost) అని సంబోధించడం ద్వారా తన మతపరమైన భావాలను గాయపరిచారంటూ ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రణవీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రణవీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాటి విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉండగా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, అందుకే లండన్ నుండి బెంగళూరుకు రాలేకపోయారని ఆయన తరపు న్యాయవాది సజ్జన్ పూవయ్య కోర్టుకు వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ గడువును పొడిగించింది.