అల్పాహారం కోసం సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. సీఎంకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు. డీకే శివకుమార్ కార్యాలయం ఇద్దరు నేతల మీటింగ్కు సంబంధించిన ఫోటో విడుదల చేసింది. ఇందులో ఇద్దరు నేతలు చర్చించుకుంటున్నారు. అంతకుముందు శనివారం కూడా ఇరువురు నేతలు అల్పాహార విందు కోసం సమావేశమయ్యారు. ఆ సమావేశం సీఎం నివాసంలో జరిగింది. డీకే శివకుమార్ నివాసానికి మంగళవారం అల్పాహార విందు కోసం వెళతానని సోమవారం సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే తనకు ఇంకా అధికారికంగా ఆహ్వానం అందలేదని సీఎం చెప్పారు. దీని తర్వాత, సాయంత్రం సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో.. డీకే శివకుమార్ సీఎంను అల్పాహారానికి ఆహ్వానించారు.
ఇరువురు నేతల భేటీపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర మాట్లాడుతూ.. 'మా ఇద్దరు నేతలు అల్పాహార విందులో మరోసారి సమావేశం కావడం శుభపరిణామం. గత నెల రోజులుగా జరుగుతున్నది శాంతియుతంగా పరిష్కరించబడాలని మేము కోరుకుంటున్నాము. పార్టీ హైకమాండ్ సూచన మేరకు వీరిద్దరూ రెండోసారి సమావేశమయ్యారు. అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సిద్ధరామయ్య శివకుమార్తో మాట్లాడారని, ఇప్పుడు శివకుమార్ సిద్ధరామయ్యకు ఫోన్ చేశారు. అంతా శాంతియుతంగా జరుగుతోంది. ఇరువురు వ్యక్తులు వేర్వేరు ఆశయాలను కలిగి ఉండవచ్చు. ఇది తప్పు అని నేను అనుకోను అని అన్నారు.