లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు: నిర్మల సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు కావాల్సిన నిధులు తన వద్ద లేవని అన్నారు.

By Medi Samrat  Published on  27 March 2024 3:00 PM GMT
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు: నిర్మల సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు కావాల్సిన నిధులు తన వద్ద లేవని అన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని మంత్రి తెలిపారు. ఒక వారం లేదా పది రోజులు ఆలోచించిన తర్వాత.. పోటీ చేసేందుకు నా దగ్గర అంత డబ్బు లేదని భావించానని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం నా వాదనను అంగీకరించినందుకు చాలా కృతజ్ఞురాలినని అన్నారు.. అందుకే నేను పోటీ చేయడం లేదని ఆమె తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు దేశ ఆర్థిక మంత్రి వద్ద కూడా సరిపడా నిధులు ఎందుకు లేవని అడిగినప్పుడు.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు చెందదని ఆమె అన్నారు. నా జీతం, నా సంపాదన, నేను పొదుపు చేసుకున్న డబ్బులు.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు సంబంధించినవి కాదన్నారు. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులను పోటీకి దింపింది. వీరిలో పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.

Next Story