కాసేప‌ట్లో సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న హేమంత్ సోరెన్

జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి సీటు మార్పు కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

By Medi Samrat  Published on  4 July 2024 11:14 AM GMT
కాసేప‌ట్లో సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న హేమంత్ సోరెన్

జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి సీటు మార్పు కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి లభించింది. ఈరోజు హేమంత్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అంతకుముందు ఉదయం హేమంత్ సోరెన్ కూటమిలో చేరిన కాంగ్రెస్ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ గురువారం అధికారికంగా ఆహ్వానించారు. భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ముందుగా సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూలై 7న జరగాల్సి ఉంది.

హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఫిబ్రవరి 2న జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. చంపై బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం హేమంత్‌ బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) చీఫ్ శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్‌కు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యాడు. జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. అందుఉ కొద్దిసేపటి ముందు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో.. ఆదేశాలను సవాలు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని వర్గాలు తెలిపాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోంగోన్ ముఖోపాధ్యాయ సింగిల్ బెంచ్ జూన్ 28న తీర్పు వెలువరించింది.

జార్ఖండ్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉండవచ్చు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 10 మంది మంత్రులు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి బలం 45 ఎమ్మెల్యేలకు తగ్గింది. జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరు JMM ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ లోక్‌సభకు ఎన్నికయ్యారు, జామా ఎమ్మెల్యే సీతా సోరెన్ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయడానికి రాజీనామా చేశారు. సోరెన్ పార్టీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బిష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్‌లను పార్టీ బహిష్కరించింది.

అలాగే ప్రతిపక్ష బీజేపీ బలం కూడా 24కి తగ్గింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ధులు మహతో (బాగ్మారా), మనీష్ జైస్వాల్ (హజారీబాగ్) ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు. మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్‌ను బీజేపీ బహిష్కరించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయ‌న‌ కాంగ్రెస్‌లో చేరారు.

Next Story