రాజ్యసభలో ఖర్గే- నిర్మ‌లా సీతారామన్ మధ్య వాడివేడి చర్చ

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

By Medi Samrat  Published on  19 Sep 2023 11:46 AM GMT
రాజ్యసభలో ఖర్గే- నిర్మ‌లా సీతారామన్ మధ్య వాడివేడి చర్చ

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖర్గే మహిళా సమస్యలపై మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉందన్నారు. అందుకే బలహీనమైన మహిళలను ఎన్నుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటు.. చదువుకుని పోరాడగలిగే వారిని ఎన్నుకోరని వ్యాఖ్యానించారు.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తున్నామని.. అయితే అన్ని పార్టీలు బలహీనమైన‌ మహిళలను ఎన్నుకుంటాయంటూ ప్రకటన చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధానమంత్రి, మా పార్టీ మనందరికీ అధికారం ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బలమైన మహిళ అని అన్నారు.

దీనిపై మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. వెనుకబడిన, ఎస్టీ మహిళలకు అందుతున్న అవకాశాలు లేవని మేం అడుగుతున్నామని అన్నారు. ఖర్గే తన ప్రకటనపై మరోసారి ఆలోచించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

రాష్ట్రాలకు జీఎస్టీ సకాలంలో అందడం లేదని ఖర్గే పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు GST, MNREGA, వ్యవసాయం, నీటిపారుదల వంటి వివిధ కార్యక్రమాలకు సకాలంలో గ్రాంట్లు పొందవు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ రాష్ట్రాలను నిర్వీర్యం చేయలేదా? బీజేపీ ప్రజాస్వామ్యం గురించి మాత్రమే మాట్లాడుతుందని.. చాలా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసిందన్నారు.

ప్రతిపక్ష నాయకుడి ప్రకటన వాస్తవంగా సరికాదని ఆర్థిక మంత్రి సీతారామన్ తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లించింది. జీఎస్టీని కూడా ప్రతిసారీ ఒకటి లేదా రెండు నెలల ముందుగానే రాష్ట్రాలకు చెల్లించేవారు. జీఎస్టీ సొమ్ము బకాయి లేదని అన్నారు.

తీవ్ర వాగ్వాదం నేప‌థ్యంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఇరువురు నేతలను శాంతింపజేసి.. త‌మ వాద‌న‌ల‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఈరోజే సంబంధిత పత్రాలను అందజేస్తామని వారిద్దరూ తెలిపారు.

Next Story