ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా
భారతదేశంలో నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తి అయిన హరీష్ రాణా మంగళవారం మరణించారు.
By - Medi Samrat |
భారతదేశంలో నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తి అయిన హరీష్ రాణా మంగళవారం మరణించారు. అయితే, ఈ వార్త రాసే సమయానికి ఎయిమ్స్ ఈ మరణాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
వర్గాల సమాచారం ప్రకారం.. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. దేశంలో గౌరవప్రదంగా మరణించే హక్కుపై హరీష్ రాణా కేసు ఒక చారిత్రాత్మక నిర్ణయంగా పరిగణించబడింది. హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ను ఉపసంహరించుకోవడానికి ఎయిమ్స్ యాజమాన్యానికి సుప్రీం కోర్టు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది.. తద్వారా ఆయన గౌరవప్రదంగా మరణించేలా చేసింది.
చివరగా, భారతదేశపు మొట్టమొదటి పరోక్ష కారుణ్య మరణంలో 13 ఏళ్లుగా బాధపడుతున్న ఒక వ్యక్తి తుదిశ్వాస విడిచారు. ఘజియాబాద్కు చెందిన హరీష్ రాణా.. ఎయిమ్స్ నిపుణుల పర్యవేక్షణలో తుదిశ్వాస విడిచారు.
13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత హరీష్ కోమాలోకి వెళ్లగా, అతని తల్లిదండ్రులు, సోదరుడు అతనికి చికిత్స చేయించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. వారు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహా తీసుకున్నారు. వైద్యులు సూచించిన చికిత్సలన్నీ చేయించుకున్నారు.. కానీ ఫలితం లేకపోయింది. చివరకు, తమ బిడ్డకు గౌరవప్రదమైన మరణం అందించడం కోసం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.