'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'

గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat
Published on : 19 July 2025 3:43 PM IST

సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..

గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఉదయం గుజరాత్ పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. ఈ బెదిరింపులు న‌కిలీవ‌ని పోలీసులు చెబుతున్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

గుజరాత్ పోలీసుల ప్రకారం.. జూలై 17న ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారిక ఈమెయిల్‌కు సందేశం వచ్చింది. ఇందులో CMO సహా గుజరాత్ సెక్రటేరియట్‌ను పేల్చివేస్తామని బెదిరింపులు వ‌చ్చాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని గాంధీ నగర్ డిప్యూటీ ఎస్పీ దివ్య ప్రకాష్ గోహిల్ తెలిపారు.

ఈమెయిల్ వ‌చ్చిన వెంటనే గాంధీ నగర్ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మొత్తం సీఎం కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. సమగ్ర విచారణ అనంతరం ఈ సమాచారం పూర్తిగా అబద్ధమని తేలింది.

గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం ప్రాంగణంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. ఇండియన్ జస్టిస్ కోడ్ మరియు ఐటీ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈమెయిల్ పంపిన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.

గుజరాత్‌లో బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు చాలా పాఠశాలలు, దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులన్నీ న‌కిలీవే. పోలీసులు అన్ని కేసులను విచారిస్తున్నారు.

Next Story