బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు
అల్ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు
By Knakam Karthik
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు
అల్ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 30 ఏళ్ల షామా పర్వీన్ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్నవారిని గుర్తించడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి ఆమె ఉగ్రవాదులకు సహాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు.
జులై 23న ఈ మాడ్యుల్ తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్, దిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరంతా సోషల్ మీడియాలోని ఓ రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ షామా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు అమలుచేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు.
అల్ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్సెల్ విభాగంతో, విదేశాలలోని ఉగ్ర సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయని.. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వీరు ఉగ్ర ముఠాలకు చేరవేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ గ్రూప్కు చెందిన ఇతర ఉగ్రవాద మద్దతుదారులు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.