జూలై 1 నుండి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నా కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఇంధనం నింపరు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) కొత్త నిబంధనను ప్రకటించింది.
జూలై 1 నుండి ఎండ్ ఆఫ్ లైఫ్ (EOL) వాహనాలకు ఇంధనం అమ్మకాలను నిలిపివేయాలని CAQM గతంలో ఇంధన కేంద్రాలను ఆదేశించింది. ఈ నియమాలు ఢిల్లీలో నమోదైన వాహనాలకే కాకుండా అన్ని EOL వాహనాలకు వర్తిస్తాయి. ఈ నిబంధనలను నివారించడానికి ప్రజలు తరచుగా ఢిల్లీ వెలుపల తమ వాహనాలను రిజిస్టర్ చేసుకుంటారు. కానీ ఇకపై ఎక్కడ రిజిస్టర్ చేయించుకున్నా కూడా అలాంటి వాహనాలకు పెట్రోల్-డీజిల్ బంద్ అని CAQM సాంకేతిక విభాగం సభ్యుడు వీరేంద్ర శర్మ అన్నారు.
ఢిల్లీలోని 520 ఇంధన బంకుల్లో 500 వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలినవి జూన్ 30 నాటికి సిద్ధంగా ఉంటాయి. ఈ కెమెరాలు వాహన డేటాబేస్ ద్వారా వాహన నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి వాటి వయస్సును తనిఖీ చేస్తాయి. వాహనం చాలా పాతది అయితే, కంట్రోల్ రూమ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు హెచ్చరికలు పంపుతారు.