గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన మృతిని అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చున్నారు.
విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1956 ఆగస్ట్ 2న అప్పటి బర్మా లోని రంగూన్ లో జన్మించిన విజయ్ రూపానీ, ఆ దేశంలోని రాజకీయ అస్థిరతల కారణంగా తన కుటుంబంతో కలిసి గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందిన ఆయన, ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంచలంచెలుగా ఎదిగి బీజేపీలో పవర్ ఫుల్ నేతల్లో ఒకరిగా నిలిచారు.