శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్‌లో అగ్ని ప్రమాదం..

Fire breaks out in Shatabdi Express at Ghaziabad railway station.శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ‌రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 4:41 AM GMT
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్‌లో అగ్ని ప్రమాదం..

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ‌రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని రైల్వేస్టేష‌న్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేష‌న్‌లో ఢిల్లీ – లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. ఈ స‌మ‌యంలో జనరేటర్, లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. ఆ వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రైల్వే సిబ్బంది స‌ద‌రు బోగీ నుంచి రైలును విడ‌దీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని నాలుగు పైరింజ‌న్లు స‌హాయంతో మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

ఉదయం 6.45 గంటలకు సమయంలో సమయంలో మంటలు చెలరేగాయి. బోగీలో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బోగీ సామగ్రి అగ్నికి ఆహుతైంది. తలుపు మూసుకుపోవడంతో మంటలను ఆర్పేందుకు పగులగొట్టాల్సి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలు బోగీకి మంటలు అంటుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 13న సైతం డెహ్రాడూన్‌ – ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. రైలులోని సి-4 కంపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలోనూ ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.




Next Story