చత్తీస్ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు(33) మృతి చెందగా.. మరో ఏడుగురు కోబ్రా సిబ్బందికి గాయాలయ్యాయి.
సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా శనివారం సాయంత్రం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చివేశారు. ఐఈడి పేలుడులో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. వారందరిని ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావ్ మరణించారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.