నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలివే..
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By - Medi Samrat |
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికలకు సన్నాహాలు పూర్తి చేసింది. దీనికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీలు ప్రకటించారు. బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని ప్రకటించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో జరుగనుండగా.. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పార్టీల నుంచి సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి 17 కోట్ల 40 లక్షల మంది ఓటు వేయనున్నారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించి 25 లక్షల మంది అధికారులను నియమించామని.. 8.5 లక్షల మంది భద్రతా బలగాలను కూడా మోహరిస్తామని.. 2 లక్షల 18 వేల పోలింగ్ బూత్లను సిద్ధం చేస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలకు, తమిళనాడులో 234, అస్సాంలో 126, కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.