విషాదం..మధ్యప్రదేశ్‌లో బావిలోని విష వాయువు పీల్చి 8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో బావిని శుభ్రం చేస్తుండగా అనుమానిత విష వాయువు పీల్చి ఎనిమిది మంది మరణించారు.

By Knakam Karthik
Published on : 4 April 2025 8:24 AM IST

National News, MadhyaPradesh, Eight People Dead, Toxic Gas

విషాదం..మధ్యప్రదేశ్‌లో బావిలోని విష వాయువు పీల్చి 8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో బావిని శుభ్రం చేస్తుండగా అనుమానిత విష వాయువు పీల్చి ఎనిమిది మంది మరణించారు. గంగౌర్ పండుగ కోసం బావిని సిద్ధం చేస్తున్న బాధితులు లోపల చిక్కుకున్నారు. ఖాండ్వా జిల్లాలో జిల్లాలోని చైగావ్ మఖాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మఖాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడటానికి మరో ఏడుగురు బావిలోకి దిగారు. అయితే వారంతా ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. బావి నుంచి వెలువడే విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతులను రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35), మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.

Next Story