కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు.

By Knakam Karthik
Published on : 10 Feb 2025 5:24 PM IST

National News, Uttarpradesh, Prayagraj, Mahakumbh Mela,President of India Draupadi Murmu

కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ సర్కార్ పటిష్ట ఏర్పాట్లు చేసింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ఆమె భగవాన్ సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. పుణ్య స్నానానికి ముందు మాతా గంగకు పుష్పాలు అర్పించారు. అనంతరం గంగా పూజ, హారతి ఇచ్చారు.

రాష్ట్రపతి హెలికాఫ్టర్ సోమవారం ఉదయం 9:30 గంటలకు బమ్రౌలి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఇక్కడ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి స్వాగతం పలికారు. అక్కడి నుంచి అరైల్ కు చేరుకొని, తర్వాత బోటులో సంగమానికి వెళ్లి స్నానం చేశారు. ఇదిలా ఉంటే భారత చరిత్రలో మహాకుంభంలో స్నానం చేసిన రెండో రాష్ట్రపతిగా ముర్ము రికార్డుల్లోకి ఎక్కారు. అంతకు ముందు 1954లో భారతదేశం తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు.

కాగా జనవరి 13 ప్రారంభం అయిన ఈ మహాకుంభమేళలో నేటి వరకు 42 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సంఖ్య కుంభమేళ ముగిసే సమయానికి 55 కోట్లు దాటుతుందనే అంచనా ఉంది.

Next Story