ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ప్రముఖ ఎయిర్లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.
By - Knakam Karthik |
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్తంగా తీవ్ర విమాన అంతరాయాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రముఖ ఎయిర్లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు గాను ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ ప్రకటించింది.
డీజీసీఏ వివరాల ప్రకారం, డిసెంబరు నెలలో ఇండిగో విమానాల్లో విస్తృత స్థాయిలో ఆలస్యాలు, రద్దులు, సిబ్బంది నిర్వహణ లోపాలు, ఫ్లైట్ షెడ్యూలింగ్ లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా విమానాలు నడపడం, సిబ్బంది డ్యూటీ టైమ్ పరిమితులను ఉల్లంఘించడం, ఆపరేషన్ ప్లానింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలు బయటపడినట్లు డీజీసీఏ తెలిపింది.
ఇండిగోపై ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించకపోవడంతో ఈ మేరకు భారీ ఆర్థిక శిక్ష విధించాల్సి వచ్చిందని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ, “డీజీసీఏ ఆదేశాలను గౌరవిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపరేషనల్ వ్యవస్థలను బలోపేతం చేస్తాం” అని పేర్కొంది. ఈ జరిమానా నేపథ్యంలో దేశంలో విమానయాన భద్రత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణపై డీజీసీఏ మరింత కఠినంగా వ్యవహరిస్తోందని విమానయాన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
DGCA (Directorate General of Civil Aviation) levies a fine of Rs 22.20 Crores on IndiGo for its flight disruptions in December 2025. pic.twitter.com/8cEf9bOZHg
— ANI (@ANI) January 17, 2026