Delhi Blast : హమాస్ త‌ర‌హా డ్రోన్‌ల వ‌ర్షం కురిపించాల‌నుకున్నారు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు పేలుడు ఘటనపై విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By -  Medi Samrat
Published on : 17 Nov 2025 9:15 PM IST

Delhi Blast : హమాస్ త‌ర‌హా డ్రోన్‌ల వ‌ర్షం కురిపించాల‌నుకున్నారు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు పేలుడు ఘటనపై విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్' పేలుడుకు ముందు ఆయుధాలను తయారు చేసేందుకు, రాకెట్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతి అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని పోలి ఉంటుంది, ఇక్కడ డ్రోన్‌లను పెద్ద ఎత్తున ఉపయోగించారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న రెండో నిందితుడు శ్రీనగర్‌కు చెందిన జసీర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్‌ని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. దీనికి ముందు మొదటి నిందితుడు అమీర్ రషీద్ అలీని ఢిల్లీలో అరెస్టు చేశారు. డానిష్ జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నివాసి. ఆత్మాహుతి బాంబర్ ఒమర్ ఉన్ నబీకి సన్నిహితుడు. దాడికి సంబంధించిన సాంకేతిక తయారీలో డానిష్ సహకరించాడని ఎన్ఐఏ తెలిపింది. అతడు డ్రోన్‌లను ఆయుధాలుగా మార్చడంతోపాటు.. రాకెట్‌లను తయారు చేయడానికి కూడా ప్రయత్నించాడు.

మూలాల ప్రకారం.. డానిష్ డ్రోన్‌లను తయారు చేసేవాడు.. అందులో పెద్ద బ్యాటరీలను అమర్చవచ్చు, తద్వారా అవి భారీ బాంబులతో ఎగురుతాయి.. రద్దీగా ఉండే ప్రాంతాలపై దాడులు జరిగేలా వాటికి కెమెరాలు కూడా ఏర్పాటు చేసేవాడు. ఈ మాడ్యూల్ సాయుధ డ్రోన్‌ను జనంలోకి పంపడం ద్వారా ఎక్కువ‌ నష్టాన్ని కలిగించే ప్ర‌య‌త్న‌మ‌ని అధికారులు అంటున్నారు.

ఇటువంటి వ్యూహాలను ఇప్పటికే అనేక సిరియన్ తీవ్రవాద గ్రూపులు, హమాస్ వంటి సంస్థలు అవలంబించాయి. డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌ కూడా తన డ్రోన్ స్ట్రైక్, యాంటీ-డ్రోన్ యూనిట్లను పెద్ద ఎత్తున బలోపేతం చేస్తోంది. తద్వారా ఇటువంటి బెదిరింపులను ఎదుర్కోనుంది.

Next Story