దక్షిణాదిన కొత్త కరోనా వైరస్‌.. సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

Covid-19 variant N440K spreading more in southern states. కరోనా మహమ్మారి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఇబ్బందులకు గురి

By Medi Samrat  Published on  20 Feb 2021 7:48 AM GMT
దక్షిణాదిన కొత్త కరోనా వైరస్‌.. సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

కరోనా మహమ్మారి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఇబ్బందులకు గురి చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్‌440కె అనే కొత్తరకం కోవిడ్‌ -19 వైరస్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అది ప్రమాదకరమైనదా.. కాదా అనే విషయంపై స్పష్టత లేకున్నా.. వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్‌ జన్యక్రమ విశ్లేషన ద్వారా వ్యాప్తిలో ఉన్న రకాల సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

సీసీఎంబీ సహా వేర్వేరు సంస్థలు చేపట్టిన కోవిడ్‌ వైరస్‌ 6400 జన్యుక్రమ విశ్లేషణలో 5వేల ఉత్పరివర్తనాలు గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రధానంగా కొన్ని రకాలే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయని తేల్చారు. ఏ3ఐ జూన్‌ 2020 వరకు వ్యాప్తిలో ఉండగా, తర్వాత ఏ2ఏ విస్తరించిందని తెలిపారు. ఇందులో డీ614జీ ఉత్పరివర్తనంతో ఎక్కువ విస్తరణకు కారణమైంది. ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల చాలా దేశాల్లో కొత్తరకం కోవిడ్‌ -19 వైరస్‌ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ మన శరీరంలో ప్రవేశించగానే శరీర కణాలకు అతుక్కుపోయే గుణంతో అధిక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నదని తేలింది.

యూకే, బ్రేజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న కొత్త రకం వైరస్‌ మన దేశంలోనూ వ్యాప్తి చెందుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్త తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకుని వ్యాప్తికి కారణమవుతున్న ఈ484కె, అధిక వ్యాప్తికి కారణమవుతున్న ఎన్‌501వై ఉత్పరతవర్తనాలు వీటిలో ఉన్నాయి. భారత్‌లో వీటి ఉనికి ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్‌ల నుంచి సేకరించిన వైరస్‌ నమూనాలను తక్కువగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తుండటం ఇందుకు కారణం కావచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువగా జన్యుక్రమాలను కనుక్కొంటే కొత్త రకం వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి ఖచ్చిత సమాచారం తెలుస్తుందని రాకేశ్‌ మిశ్రా అన్నారు.


Next Story