వివాహ పథకానికి అర్హతను తనిఖీ చేయడానికి గర్భ నిర్ధారణ పరీక్షలు.!

వివాహ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేయడానికి వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై

By అంజి  Published on  24 April 2023 4:30 AM GMT
marriage scheme, Madhya Pradesh, pregnancy test, National news

వివాహ పథకానికి అర్హతను తనిఖీ చేయడానికి గర్భ నిర్ధారణ పరీక్షలు.!

వివాహ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేయడానికి వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార బీజేపీ విరుచుకుపడింది. దిండోరి జిల్లాలోని గడసరాయ్ పట్టణంలో.. జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద 219 జంటలకు సామూహిక వివాహం చేయించింది. అయితే ఈ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన కొంతమంది మహిళల పేర్లు జాబితాలో కనిపించలేదు. వారి ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు పాజిటివ్‌గా తేలడంతో వారి పేర్లను ప్రస్తావించలేదని తెలిసింది.

ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.55,000 చొప్పున మంజూరు చేస్తుంది. రూ.55,000 గ్రాంట్‌లో రూ.49,000 పథకానికి అర్హులైన మహిళలకు అందజేయగా, రూ.6,000 సామూహిక వివాహాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. బచ్చర్‌గావ్ నివాసి అయిన ఒక మహిళ.. తాను ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద వివాహం చేసుకోవడానికి ఫారమ్‌ను పూరించానని చెప్పారు. ఫారమ్‌ను పూరించిన తర్వాత, బజాగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల సమయంలో గర్భ పరీక్ష కూడా జరిగింది. పరీక్ష సానుకూలంగా వచ్చిన తర్వాత, పథకం కింద నిర్వహించాల్సిన వివాహాల జాబితా నుండి పేరు తొలగించబడిందని ఆమో పేర్కొంది. బచ్చర్‌గావ్‌కు చెందిన మరో మహిళ తనకు వైద్య పరీక్ష గురించి ఏమీ చెప్పలేదని ఆరోపించారు. జాబితాలో ఆమె పేరు ప్రస్తావించలేదు. పూర్తి సన్నాహాలతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నానని, అయితే పెళ్లి చేసుకోలేకపోయానని మహిళ చెప్పింది.

ప్రెగ్నెన్సీ టెస్టులు 'మహిళలను అవమానించడం' అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్ మంత్రి ఓంకార్ మార్కమ్ గర్భ పరీక్షలను "మహిళలను అవమానించడమే" అని విమర్శించారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద గర్భ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏదైనా నిబంధనలు రూపొందించి ఉంటే దానిని బహిరంగపరచాలన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ విమర్శలను దిండౌరీ కలెక్టర్‌ వికాశ్‌ మిశ్రా తోసిపుచ్చారు. పెళ్లి చేసుకునే యువతులకు సికిల్‌సెల్‌ పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే సికిల్‌ సెల్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. కొందరు తమకు పీరియడ్‌ సమస్య ఉందని చెప్పారని, దీంతో వారికి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే యువతులకు గర్భ నిర్ధారణ నిర్వహించాలనే రూల్‌ లేదని కలెక్టర్ మిశ్రా తెలిపారు.

Next Story