కాంగ్రెస్ 'సమాజంలో అల్లర్లను ప్రోత్సహిస్తుంది' : జేపీ నడ్డా

Congress 'encourages riots in society' whenever it comes to Power. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కర్ణాటకలోని దావంగెరె జిల్లా హోనాలిలో

By Medi Samrat  Published on  30 April 2023 10:45 AM GMT
కాంగ్రెస్ సమాజంలో అల్లర్లను ప్రోత్సహిస్తుంది : జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కర్ణాటకలోని దావంగెరె జిల్లా హోనాలిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పీఎఫ్‌ఐకి మద్దతిస్తుంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా సమాజంలో అల్లర్లను రెచ్చగొట్టే పని చేస్తుందని, గొడవలు పెట్టుకునే వారికి ఆశ్రయం ఇస్తుందని నడ్డా అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంద‌న్నారు. కర్ణాటకను డబుల్ ఇంజన్ పవర్‌తో ముందుకు తీసుకెళ్లేందుకు బొమ్మై, యడ్యూరప్ప కృషి చేస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలోని పేదలు, రైతులు, మహిళల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

9 ఏళ్ల క్రితం భారత్‌లో 92 శాతం మొబైల్‌లు చైనా, ఇతర దేశాల నుంచి వచ్చాయని నడ్డా తెలిపారు. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 97 శాతం మొబైల్‌లు భారతదేశంలో తయారు చేయబడుతున్నాయన్నారు. ఆటోమొబైల్స్‌లో జపాన్ మ‌న‌కంటే మెరుగైన స్థితిలో ఉండ‌గా.. నేడు భారత్‌ జపాన్‌ను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందన్నారు.

ఈ ఎన్నికలు కర్ణాటక ప్రజల భవిష్యత్తు కోసమేనని న‌డ్డా అన్నారు. కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ రాబోతోందన్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌గా మారనుంది. కేవలం హైవేలకే దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామ‌న్నారు. గ్రామాలు, పేదలు, అణగారిన వర్గాల వారు, బాధితులు, దోపిడీకి గురవుతున్నవారు, దళితులు, మహిళలు, రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఆర్థికాభివృద్ధి గురించి చెబుతూనే సామాజిక న్యాయానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని నడ్డా అన్నారు.


Next Story