ఉత్కంఠ‌కు తెర‌.. పంజాబ్‌ సీఎం అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన రాహుల్‌

Congress announces Charanjit Singh Channi as its CM face. ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే

By Medi Samrat
Published on : 6 Feb 2022 6:13 PM IST

ఉత్కంఠ‌కు తెర‌.. పంజాబ్‌ సీఎం అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన రాహుల్‌

ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పంజాబ్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఆదివారం లూథియానా పర్యటనలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని పార్టీ ముఖ్యమంత్రి అభ్య‌ర్ధిగా ప్రకటించారు. ఐవీఆర్‌ కాల్స్ ద్వారా పంజాబ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రజల అభిప్రాయాన్ని కోరిన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సూచన మేరకు అట్టడుగు వర్గాల వారి బాధను అర్థం చేసుకునే పేద నేపథ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కావాలని పార్టీ కోరుతున్నట్లు కాంగ్రెస్ సీఎం పేరు ప్రకటించాక‌ రాహుల్ గాంధీ చెప్పారు. చన్నీ పేద కుటుంబానికి చెందినవాడు. అతను పేదరికాన్ని అర్థం చేసుకున్నాడు. దానిని లోతుగా తెలుసుకుంటాడు. అతని గుండె, రక్తంలో పంజాబ్ ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. రాహుల్ గాంధీ కారణంగానే ఓ పేదవాడు పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడని చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ధన్యవాదాలు తెలిపారు. నేను ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నేను ఒంటరిగా పోరాడలేని పెద్ద యుద్ధం.. పోరాడటానికి నాకు డబ్బు, ధైర్యం లేదు.. పంజాబ్ ప్రజలు ఈ యుద్ధంలో పోరాడతారని చన్నీ వ్యాఖ్యానించారు. పార్టీ సీఎం అభ్య‌ర్థి రేసులో ఉన్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఆయ‌న‌ మాత్రమే పంజాబ్‌కు దళితుడిని ముఖ్యమంత్రిని చేయగలనని అన్నారు.

చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ముఖ్యమంత్రి అభ్య‌ర్ధులుగా పోటీలో ఉన్నారు. అయితే ఎవరిని ఎంపిక చేసినా తాము నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాహుల్‌ గాంధీకి ఇద్దరూ హామీ ఇచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న 117 నియోజకవర్గాలకు ఒకే దశలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాబోయే పంజాబ్ ఎన్నికలలో బదౌర్, చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండగా.. నవజ్యోత్ సింగ్ సింధు అమృత్‌సర్ తూర్పు నుండి పోటీలో ఉన్నారు.


Next Story