కాంగ్రెస్ నేతపై యాసిడ్ దాడి యత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
Congress alleges acid attack after youth tries to throw ‘chemical' at Kanhaiya Kumar. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్పై కొందరు వ్యక్తులు ఇంక్ విసిరారు.
By అంజి Published on 2 Feb 2022 11:34 AM IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్పై కొందరు వ్యక్తులు ఇంక్ విసిరారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటుచేసుకుంది. లక్నో సెంట్రల్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సదాఫ్ జాఫర్ నామినేషన్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న కన్హయ్య కుమార్పై సిరా విసిరారు. అయితే కన్హయ్య కుమార్పై విసిరినది సిరా కాదని, ఒక రకమైన యాసిడ్ అని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే, అదృష్టవశాత్తూ.. కన్హయ్య కుమార్పై యాసిడ్ పడలేదు. సిరా విసిరినప్పుడు, సమీపంలో నిలబడి ఉన్న ముగ్గురు, నలుగురు యువకులపై కొన్ని చుక్కలు పడ్డాయి. యువకుడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇదంతా కుట్రలో భాగమేనని, దాడికి యత్నించిన యువకుడు బీజేపీకి చెందిన వాడని ఆరోపించారు.
లక్నో సెంట్రల్ స్థానం నుంచి నటి, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ను కాంగ్రెస్ పోటీకి దింపింది. సదాఫ్ జాఫర్ ఉత్తరప్రదేశ్లోని లక్నోకు నివాసి. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, నటి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నారు. విశేషమేమిటంటే, చిత్రనిర్మాత మీరా నాయర్ యొక్క 'ఎ సూటబుల్ బాయ్'లో సదాఫ్ జాఫర్ ఒక నటి పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి లక్నోలో నివసిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల సందర్భంగా యుపి పోలీసులు ఆమెను లక్నోలో అరెస్టు చేశారు. అల్లర్లు, హత్య ఆరోపణలపై ఆమె అరెస్టు తర్వాత సదాఫ్ జాఫర్ ప్రస్తుతం బెయిల్పై జైలు నుండి బయట ఉన్నారు.
యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో, ఎన్నికల సంఘం కూడా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ని నిర్ధారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.