పెట్రోల్-డీజిల్ వాహనాలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో మార్పులు వస్తే ప్రజలు కూడా వాటికి దూరమవుతారని ఎంతో మంది సూచించారు. ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించే ముఖ్యమంత్రులు, మినిస్టర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచేందుకు ప్రత్యేకంగా ప్రోత్సహకాలు అందిస్తోంది. ప్రజలకు ఆదర్శనంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)లను ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులకు లేఖ రాశారు.
డీజిల్, పెట్రోల్ ఇంజన్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కోరారు. ఆయా శాఖల వారీగా ఉపయోగిస్తున్న పెట్రోలు, డీజిల్ వాహనాలను సైతం ఈవీలగా మార్చాలని కోరారు. అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈవీలనే వాడాలని సూచించింది. మొదట ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఇలా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు చూస్తే.. ప్రజలు కూడా వాటిని వాడటానికి ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.