Video: హిమాచల్ప్రదేశ్లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik
Video: హిమాచల్ప్రదేశ్లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదలు
హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కులు జిల్లాలో పలు చోట్ల క్లౌడ్ బరస్ట్ కావడంతో ఆకస్మిక వరదలు చోటుచేసుకున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ వరదల్లో అనేక ఇళ్ళు, లింక్ రోడ్లు, చిన్న వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ వరదల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఆకస్మిక వరదలతో నదులలో నీటిమట్టం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కులు జిల్లాలోని మూడు చోట్ల... సైంజ్లోని జీవా నల్లా, రెహ్లా బిహాల్, గడ్సా ప్రాంతంలోని శిలాఘర్లలో క్లౌడ్ బరస్ట్ కావడంతో కుండపోత వర్షం కురిసింది. రెహ్లా బిహాల్లో ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ల నుండి విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ వరదలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. ఇక, కులు జిల్లాలో ఆకస్మిక వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని వీడియోలలో వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది.
నదులు, వాగులు ఉప్పొంగడంతో కుల్లు జిల్లా అంతటా భారీ వరదలు సంభవించాయి. బియాస్ నది ప్రవాహంతో మనాలీ – చండీగఢ్ జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్డివిజనులో ఓ వంతెన కొట్టుకుపోయింది. కుల్లు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపే కీలక రహదారి అయిన.. ఆట్-లుహ్రీ-సైంజ్ నేషనల్ హైవే మూతపడడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.