మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ, హిందూ సంస్థల నాయకులు స్వాగతించారు. ఈ కేసును NIAకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు దక్షిణ కన్నడ ఎంపీ బ్రిజేష్ చౌతా. కేంద్రం తీసుకున్న నిర్ణయం దక్షిణ కన్నడలో దేశ వ్యతిరేక శక్తులను విచ్ఛిన్నం చేసే దిశగా మొదటి అడుగుగా ఆయన అభివర్ణించారు. "ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ విధానానికి బలమైన సాక్ష్యం. ఈ కేసును చేపట్టమని జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఎంపీ బ్రిజేష్ చౌతా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
మే నెలలో మంగళూరు నగరంలోని బాజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు సుహాస్ శెట్టి అనే వ్యక్తిని హత్య చేశారు. మే 1న రాత్రి 8.27 గంటలకు శెట్టి మరో ఐదుగురితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దాడి చేశారు. వారి వాహనాన్ని మరో రెండు కార్లు అడ్డగించాయి. అందులో నుండి ఐదు నుండి ఆరుగురు దుండగులు బయటకు వచ్చి శెట్టిపై కత్తి, ఇతర మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుహాస్ శెట్టి మరణించాడు.