దేశ వ్యాప్త జనగణనకు నోటిఫికేషన్ రిలీజ్..విధుల్లో 34 లక్షల మంది గణకులు
భారత్లో 16వ జనభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik
దేశ వ్యాప్త జనగణనకు నోటిఫికేషన్ రిలీజ్..విధుల్లో 34 లక్షల మంది గణకులు
భారత్లో 16వ జనభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనగణనలో భాగంగా తొలిసారి కులాల వారీగా కూడా గణాంకాలను సేకరించనున్నారు. ఈ సమగ్ర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. వీరికి సహాయంగా మరో 1.34 లక్షల మంది ఇతర సిబ్బంది కూడా ఈ విధుల్లో పాలుపంచుకోనున్నారు.
జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. గణన సిబ్బంది ట్యాబ్లెట్ పరికరాల ద్వారా వివరాలను నమోదు చేస్తారు. అంతేకాకుండా, ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టళ్లు, మొబైల్ యాప్లను అందుబాటులోకి తీసుకురానుంది. సేకరించిన సమాచారం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డేటా సేకరణ, బదిలీ మరియు నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలిపింది. 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక సమాచారాన్ని అందించనుంది.
ఏయే తేదీల్లో అంటే..?
కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూకశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 అర్ధరాత్రి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది.
భారత జనాభా (చివరి లెక్కల ప్రకారం):
• 2011 జనగణనలో భారత జనాభా: 1.21 బిలియన్ (121 కోట్లు)
• 2025 అంచనా ప్రకారం జనాభా: సుమారుగా 1.43 బిలియన్ (143 కోట్లు)
• ఇది చైనా కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
• 2021 జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడింది
• ఇది స్వాతంత్ర్యం తరువాత మొదటి సారి
• అందుకే 2027 జనాభా లెక్కలు మరింత ప్రాముఖ్యం పొందాయి
జనగణనలో ఏమేం లెక్కిస్తారు?
• జనాభా సంఖ్య
• కుటుంబ సభ్యుల వివరాలు
• విద్యా స్థాయి
• జీవన ప్రమాణాలు
• వలస సమాచారం
• సామాజిక వర్గాలు (కులాలు, జాతులు)
• పౌరసత్వ సమాచారం
• వయస్సు, లింగం, మతం, భాషలు మొదలైనవి
జనగణన కోసం ప్రభుత్వం ఉపయోగించే టెక్నాలజీ:
• మొబైల్ యాప్ ఆధారిత డేటా సేకరణ
• NPR (National Population Register) అనుసంధానం
• భౌగోళిక సమాచారం (GIS) ఆధారిత మ్యాపింగ్
• ఇంటింటికీ డిజిటల్ ఫారమ్ లెక్కింపు