దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ఇంధన నిల్వలు మెరుగుపడుతుండటంతో పాటు సరఫరా వ్యవస్థ స్థిరంగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించాయి. ధరల పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసిన ప్రభుత్వం, ధరల స్థిరత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది.
అయితే, ఈ ధరల ఉపశమనం కేవలం పెట్రోల్, డీజిల్కు మాత్రమే వర్తిస్తుందని, ఎల్పీజీ (వంటగ్యాస్) విషయంలో కాదని అధికారులు స్పష్టత ఇచ్చారు. గత 12 ఏళ్లలో గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 110 మేర పెరిగిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.
ముడి చమురు దిగుమతుల కోసం భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. సమస్యాత్మకమైన 'హోర్ముజ్ జలసంధి'పై ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర సురక్షిత మార్గాల ద్వారా దిగుమతులను 60% నుండి 70% కి పెంచుకుంది. ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో కూడా రవాణా పునరుద్ధరణ జరగడంతో ఇంధన సరఫరా గాడిలో పడిందని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని వివరించారు.