ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్పటికే సారీ చెప్పారు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని అన్నారు.