సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అక్కడి సైన్యం వరకూ అందరూ భారత్పై విషం చిమ్ముతున్నారు. పాకిస్థాన్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా శత్రువు (భారత్) లాక్కోలేదని పాకిస్థాన్ ప్రధాని ఇటీవల అన్నారు. షాబాజ్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీటుగా సమాధానం ఇచ్చారు.
మా దగ్గర బ్రహ్మోస్ ఉందని, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని ఒవైసీ అన్నారు. ఇక చాలు.. ఇలాంటి బెదిరింపులు భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు. అంతే కాకుండా పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడటంపై ఒవైసీ.. ‘నేను క్రికెట్ మ్యాచ్లు చూడబోనని.. నా మనస్సాక్షి, నా హృదయం అందుకు అనుమతించదు.. రోజూ మనల్ని బెదిరిస్తున్న ఆ దేశంతో ఎందుకు క్రికెట్ ఆడాలి? అని ప్రశ్నించారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసి సింధు నదిపై డ్యామ్ నిర్మించాలని ప్రయత్నిస్తే యుద్ధం తప్పదని పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గతంలో హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 22 న భారత ప్రభుత్వం 1960 నుండి అమలులో ఉన్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత భూభాగం గుండా ప్రవహించే ఆరు నదులలో మూడింటి నీటిని పాకిస్తాన్ పొందుతుంది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు అందజేసేంత వరకూ ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందని భారత్ చెబుతోంది.