బెంగళూరులోని మడివాలా పోలీస్ స్టేషన్కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం విధానసౌధ నుండి రాజ్ భవన్కు యూనిఫాంలో నడిచి వెళ్లారు. ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్స్ పై నిరసన వ్యక్తం చేస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ ఇలాంటి పని చేశారు.
సీనియర్ పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు నల్ల బ్యాండ్ ధరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను పట్టుకున్నారు. రాజ్ భవన్ సమీపంలో విధానసౌధ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడంతో నిరసన ప్రదర్శన ముగిసింది.
జూన్ 4న ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, అనేక మంది గాయపడిన నేపథ్యంలో పోలీసు కమిషనర్ బి.దయానందను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. దయానందకు మద్దతుగా మాజీ పోలీసు అధికారులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరులు ర్యాలీ చేస్తూ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా గళం వినిపించారు.