మోదీ సభకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల బస్సుకి ఘోర ప్రమాదం

ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు రోడ్డుప్రమాదానికి గురి అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 6:09 AM GMT
BJP workers, bus Accident, madhyapradesh, PM Modi,

మోదీ సభకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల బస్సుకి ఘోర ప్రమాదం

ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు రోడ్డుప్రమాదానికి గురి అయ్యింది. ఈ ప్రమాదంలో 39 మంది బీజేపీ శ్రేణులు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోల్‌ జిల్లాలో అర్ధరాత్రి జరిగింది ఈ రోడ్డు ప్రమాద సంఘటన. ప్రధాని మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురి అయ్యింది. బీజేపీ శ్రేణులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. బీజేపీ కార్యకర్తలు భోపాల్‌లో జరిగే 'కార్యకర్త మహాకుంభ్‌' సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కస్రవాడ దగ్గర అర్ధరాత్రి బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కాగా.. రోడ్డుప్రమాదంలో గాయపడ్డవారు ఎక్కువగా ఖపర్జమ్లీ, రూప్‌గఢ్, భగవాన్‌పురా, రాయ్ సాగర్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన 'జన్ ఆశీర్వాద యాత్ర' అధికారిక ముగింపు, జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ 'కార్యకర్త మహాకుంభ్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వార ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలను సభకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కాగా అధికార పార్టీ కాంగ్రెస్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌లో గత 45 రోజులలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది మూడోసారి.

Next Story