మ‌నీశ్ సిసోడియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర

BJP Conspiring To Kill Arvind Kejriwal Says Manish Sisodia.ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 6:41 AM GMT
మ‌నీశ్ సిసోడియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను హ‌త్య చేసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) కుట్ర‌లు ప‌న్నుతోంద‌న్నారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఢిల్లీ అసెంబ్లీ, మున్నిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతోనే బీజేపీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిపారు. ఇందులో బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ ప్ర‌మేయం ఉంద‌న్నారు. శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మేర‌కు ఉప ముఖ్య‌మంత్రి ఆరోప‌ణ‌లు చేశారు

ఈ విషయంపై ఆప్ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి, ఢిల్లీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. తివారీని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయ‌న్ను విచారిస్తే అస‌లు నిజాలు వెలుగులోకి వ‌స్తాయన్నారు .కేజ్రీవాల్ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలకు మనోజ్ తివారీ బహిరంగంగా చెప్పారని, ఇప్పటికే పక్కా ప్లాన్ ను సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. గురువారం మ‌నోజ్ తివారీ చేసిన ట్వీట్ పై మ‌నీశ్ సిసోడియా ఈ విదంగా స్పందించారు.

కేజ్రీవాల్‌ భద్రత గురించి బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ పలు వ్యాఖ్యలు చేశారు. 'అంతులేకుండా కొనసాగుతన్న అవినీతి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, జైల్లో ఆప్‌ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్‌ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ భద్రతపై నాకు ఆందోళనగా ఉంది. ఇప్పటికే ఆప్‌ ఎమ్మెల్యేలను చితకబాదిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నా' అంటూ మనోజ్‌ తివారీ ట్వీట్ చేశారు.

Next Story