కస్టడీలో ఉండే జీవోను విడుదల చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 24 March 2024 9:38 AM IST
కస్టడీలో ఉండే జీవోను విడుదల చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవల అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినది. ఢిల్లీ మంత్రి అతిషి ఈరోజు ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న దేశ రాజధానిలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఆయన అధికారిక నివాసంలో సోదాలు చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ED అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో ఆరోపించిన అవకతవకలలో ఆయన పాత్రకు సంబంధించి విచారణ కోసం శుక్రవారం నాడు మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపారు. అరెస్టు అయినా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. అవసరమైతే ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని హామీ ఇచ్చారు. "అవసరమైతే, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా నిర్ధారించలేదు, కాబట్టి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు." అని అతిషి చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ కోసం జైల్లో కార్యాలయానికి అనుమతిని కోరుతామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలిస్తారని, జైల్లో కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని అన్నారు. జైలు నుంచి పాలన సాగించకూడదని ఎక్కడా నిబంధన లేదని, దోషిగా నిరూపణ అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రిగా జైలు నుంచి పని చేయవచ్చని చట్టం చెబుతోందని భగవంత్ మాన్ అన్నారు. ఆయన పని చేయడానికి వీలుగా జైల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతిని కోరుతామని తెలిపారు.