ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక కుప్పకూలి ఉండవచ్చంటున్నారు
By అంజి
ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక కుప్పకూలి ఉండవచ్చంటున్నారు. అటు 242 మంది ప్రయాణికులు, వారి లగేజీ బరువు కారణంగానూ విమానంపైకి ఎగరడంలో సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. అధిక బరువు వల్ల వేగం తగ్గడంతో పైలట్ విమానాన్ని రన్వే చివరి వరకు తీసుకెళ్లి, తప్పనిసరి పరిస్థితుల్లో లిఫ్ట్ ఆఫ్ చేశాడంటున్నారు. ఈ ప్రమాదంలో 241 మంది చనిపోగా ఒక్కరే ప్రాణాలతో బయపడిన విషయం తెలిసిందే. మృతదేహాలను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ శ్రమిస్తోంది.
ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 81 మృతదేహాలను రివకరీ చేశామని చెప్పారు. మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని, తమ బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేపట్టింది. అటు నేడు పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్కు వెళ్లే అవకాశం ఉంది. ఘటనా స్థలం నుండి అనేక మృతుల మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. విద్యార్థులు సహా అనేక మంది గాయపడిన వారితో పాటు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
భారతదేశంలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంపై అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అమెరికా విమానయాన అధికారులు దర్యాప్తుకు చురుకుగా మద్దతు ఇస్తున్నారని ప్రకటించారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక ప్రకటనలో, భారత అధికారులకు సహాయం చేయడానికి అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB)తో సమన్వయం చేసుకుంటోందని,ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుండి దర్యాప్తుదారులను క్రాష్ సైట్కు పంపుతున్నామని డఫీ తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై యుకె రాజకుటుంబం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అధికారిక సందేశంలో, రాజు చార్లెస్ III మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.