తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మధురైలో ఆదివారం జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. డీఎంకే అవినీతి పాలన తమిళనాడులోని పేదలు, మహిళలు, పిల్లలను ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ పార్టీ ప్రభుత్వాన్ని ఈ సారి అధికారానికి దూరం చేయాలని పార్టీ సభ్యులను కోరారు.
TASMAC కుంభకోణంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఆ అవినీతి సొమ్ముతో తమిళనాడు అంతటా ప్రతి పాఠశాలలో రెండు తరగతి గదులను నిర్మించవచ్చన్నారు. 2021 ఎన్నికల హామీలను డీఎంకే నెరవేర్చిందో లేదో స్టాలిన్ ప్రజలకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో తమిళనాడుకు రూ.6.80 లక్షల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా కేంద్రం ఏమి ఇవ్వలేదని అనడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలన్నారు. ఏప్రిల్లో తమిళనాడు పర్యటన సందర్భంగా అన్నాడీఎంకేతో సంబంధాల పునరుద్ధరణను షా ప్రకటించారు.