సైబర్ నేరాలు, సైబర్ మోసాల గురించి పౌరులను హెచ్చరించే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఉన్న కాలర్ ట్యూన్ ఇక నుండి వినబడదు. వినియోగదారుడు ఫోన్ చేసిన ప్రతిసారీ ప్లే చేసే ప్రీ-రికార్డ్ సందేశాన్ని నేటి నుండి ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెరుగుతున్న సైబర్ మోసాల కేసుల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో భాగమైన ఈ సందేశాన్ని ఉపసంహరించుకున్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన పెంచడానికి, డిజిటల్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అమితాబ్ బచ్చన్ తన చొరవ చూపించారు. కాల్స్ కనెక్ట్ అయ్యే ముందు ప్లే అయ్యే ఈ కాలర్ ట్యూన్లో ఫిషింగ్, ఆన్లైన్ స్కామ్లు వంటి సాధారణ సైబర్ బెదిరింపుల గురించి సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో కాలర్ ట్యూన్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని పలువురు విమర్శలు కూడా గుప్పించారు.