తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?

డీలిమిటేషన్‌తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.

By Knakam Karthik  Published on  26 Feb 2025 2:33 PM IST
National News, Amith Shah, MK Stalin, Tamilnadu, Delimitation

తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?

డీలిమిటేషన్ కారణంగా తమిళనాడు ఎనిమిది లోక్‌సభ స్థానాలను కోల్పోతుందన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. డీలిమిటేషన్‌తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు ఎనిమిది లోక్‌సభ స్థానాలను కోల్పోతుందన్న స్టాలిన్ వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని.. లోక్‌సభలో ప్రధాని మోడీ ఎప్పుడో స్పష్టంగా చెప్పారు" అని అమిత్ షా గుర్తు చేశారు.

అయితే వచ్చే ఏడాది జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా స్థాయిల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండి లోక్‌సభ ఎంపీల నిష్పత్తిని కూడా మార్చవచ్చు. ఈ అంశం తమిళనాడులోని అధికార డీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక ప్రధాన ఘర్షణగా మారింది.

మరో వైపు డీలిమిటేషన్ వల్ల కలిగే చిక్కులను చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడు తన హక్కులను కాపాడుకోవడానికి నిరసన తెలపాల్సిన కీలక దశలో ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియను "దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి"గా ఆయన అభివర్ణించారు. జనాభా నియంత్రణ చర్యలలో రాష్ట్రం విజయం సాధించినప్పటికీ, ఇది పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

Next Story