తొలి జాబితాలో 'బీజేపీ' రెబల్స్‌కు పెద్ద‌పీట వేసిన అఖిలేష్ యాద‌వ్

Akhilesh giving tickets to rebels coming from BJP. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు దేశంలో హాట్ టాఫిక్‌గా మారాయి. అధికార బీజేపీ నేత‌లు

By Medi Samrat  Published on  14 Jan 2022 5:11 AM GMT
తొలి జాబితాలో బీజేపీ రెబల్స్‌కు పెద్ద‌పీట వేసిన అఖిలేష్ యాద‌వ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు దేశంలో హాట్ టాఫిక్‌గా మారాయి. అధికార బీజేపీ నేత‌లు ఒక్కొక్క‌రు పార్టీని వీడుతుండ‌టంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. అదికాక‌.. పార్టీ ఫిరాయింపుల ప్రక్రియను ముమ్మరం చేసిన ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థుల తొలి జాబితాలో బీజేపీని వీడిన వారికి పెద్ద‌పీట వేసింది. అభ్యర్థి బలంగా ఉండి, ప్ర‌జ‌ల నుండి మంచి మద్దతు ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చింది అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని కూట‌మి. ఈ మేర‌కు ప్రస్తుతం పార్టీ మారిన ఆరుగురు నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పటి వరకు తొలి జాబితాగా 29 సీట్ల‌ను ప్ర‌క‌టించారు. శుక్రవారం మరిన్ని పేర్లను ప్రకటించనున్నట్లు తెలిపారు.

బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లోకి వల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఫిరాయింపుదారులంద‌రికీ టికెట్లు ఇచ్చి బీజేపీకి గ‌ట్లి షాక్ ఇచ్చింది ఎస్పీ. ఇక‌ టిక్కెట్ల కోసం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతున్నారు. గురువారం ప్ర‌క‌టించిన తొలిజాబితా చూసిన నేత‌ల‌కు పార్టీ మారితే టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనే ఆశలు పెరిగాయి. బీఎస్పీ నేత‌ అస్లాం చౌదరి ఎస్పీలోకి వచ్చి చాలా కాలమైంది. ఆయన ధౌలానా స్థానం నుంచి గెలుపొందారు. ఆయనకు అక్కడ నుంచి ఎస్పీ టిక్కెట్టు ఇచ్చారు. బిజెపి నుండి ఆర్‌ఎల్‌డిలోకి వచ్చిన ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా కూడా నాలుగుసార్లు ఎంపీగా ఉన్నారు. హర్యానాలో కూడా అతనికి భారీ మద్దతు ఉంది. ఇప్పుడు ఆర్‌ఎల్‌డీ నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యాడు.

కాంగ్రెస్‌ను వీడి ఆర్‌ఎల్‌డీలో చేరిన గజరాజ్‌సింగ్‌కు కూడా టిక్కెట్ దక్కింది. గజరాజ్ సింగ్ హాపూర్ నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. బీఎస్పీని విడిచిపెట్టిన‌ హాజీ యూనస్ కూడా బులంద్‌షహర్ నుండి అభ్యర్థిగా ప్ర‌క‌టించారు. యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కోకబ్ హమీద్ కుమారుడు అహ్మద్ హమీద్‌కు ఆర్‌ఎల్‌డీ బాగ్‌పత్ నుంచి టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆయన బాగ్‌పత్ నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. కోకబ్ హమీద్ ప‌లుసార్లు బాగ్‌పత్ నుంచి ఎన్నికల్లో గెలుపొందారు.


Next Story