ఐశ్వర్యారాయ్ బచ్చన్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన ఫొటోలను, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె చిత్రాలను గానీ, వ్యక్తిగత హక్కులను గానీ దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా ఐశ్వర్య ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడటం వల్ల ఆమెకు కేవలం ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా, ఆమె ప్రతిష్ఠ, గౌరవం, సామాజిక ఇమేజ్కు తీవ్ర భంగం కలుగుతోందని న్యాయస్థానం తన తీర్పులో అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పలు ఇ-కామర్స్ వెబ్సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లో పేర్కొన్న అన్ని వివాదాస్పద యూఆర్ఎల్లను తక్షణమే తొలగించి, బ్లాక్ చేయాలని ఆదేశించింది.
నోటీసులు అందుకున్న 72 గంటల్లోగా యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని, ఏడు రోజుల్లోగా ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 జనవరి 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.