రాజీవ్ బన్సల్ కు కీలక పదవి
Air India CMD Rajiv Bansal becomes Civil Aviation Secretary. ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ బన్సల్
By M.S.R Published on 22 Sept 2021 4:29 PM IST
ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ బన్సల్ పౌరవిమానయాన శాఖ సెక్రెటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ సెక్రెటరీగా పనిచేస్తున్న ప్రదీప్సింగ్ ఖరోలా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో రాజీవ్ బన్సల్ను నియమించారు. బన్సల్ గత ఏడాది ఫిబ్రవరిలో ఎయిరిండియా సీఎండీగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్నిరోజులకే ఆయనను రెండోసారి ఎయిరిండియా సీఎండీగా నియమించారు. బన్సల్ 1988 బ్యాచ్కు చెందిన నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. హర్యానాకు చెందిన రాజీవ్ బన్సల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలో కూడా తన సేవలు అందించారు. ఎయిరిండియా సీఎండీగా బాధ్యతలు చేపట్టకముందు రాజీవ్ బన్సల్.. భారత పెట్రోలియం, సహజవాయు శాఖల మంత్రిగా పనిచేశారు.
ఇక ఎయిరిండియా అమ్మకం చివరి దశకు చేరుకుంది. రెండు సంస్థలు మాత్రమే ఫైనల్ బిడ్స్ సమర్పించాయి. వీటిలో ఒకటి టాటా సన్స్ సంస్థ కాగా, మరొకటి స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్సింగ్ ఉన్నారు. ఎయిరిండియాకు 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్, దేశీయ విమానాశ్రయాల్లో పార్కింగ్ స్లాట్లపై నియంత్రణ కలిగి ఉన్నది. విదేశాల్లో 900 స్లాట్లను సొంతం చేసుకున్నది. ఎయిరిండియా 2018 లో 76 శాతం వాటాను విక్రయించడానికి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు బిడ్డర్ను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైంది. అయితే, ఈసారి ఎయిరిండియాలో తన మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.