గుజరాత్లోని అహ్మదాబాద్లో మైనర్ బాలికలను ట్రాప్ చేసి, నకిలీ ఆధార్ కార్డులతో హోటళ్లకు తరలించేందుకు ప్రయత్నించిన దారుణమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో వాస్నా ప్రాంతానికి చెందిన ఆమిర్ అలీ షేక్, మహమ్మద్ సిరాజ్ సల్మానీ, అల్తాబ్ అలీ అన్సారీ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేయగా, నాలుగో నిందితుడు అరవింద్ చౌహాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సుమారు ఒకటిన్నర ఏళ్లుగా సదరు మైనర్ బాలికలతో పరిచయం పెంచుకున్న నిందితులు, వారిని ప్రలోభపెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా బాలికలను హోటల్కు తీసుకెళ్లేందుకు, వారు మైనర్లు కాదని నమ్మించేలా వయస్సును పెంచి చూపేలా 'హోనెస్టా' అనే అప్లికేషన్ ద్వారా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించారు.
అయితే, నిందితులు బాలికలతో కలిసి వెళ్తుండటాన్ని గమనించిన ఒక పరిచయస్థుడు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. వీరు హోటల్కు చేరుకోకముందే పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కేవలం వయస్సునే కాకుండా, హోటల్ చెక్-ఇన్ సులభతరం చేసేందుకు కొన్ని కార్డుల్లో కుల వివరాలను కూడా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఫోర్జరీ, మోసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాలుగో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఈ ముఠా గతంలో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందా అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నామని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు.