డీఎన్ఏ పరీక్షల ద్వారా 11 మృతదేహాల గుర్తింపు
గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ-171 కుప్పకూలడంతో 241 మంది ప్రయాణికులు మరణించారు
By Medi Samrat
గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ-171 కుప్పకూలడంతో 241 మంది ప్రయాణికులు మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘని నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో హాస్టల్పై విమానం పడిపోవడంతో అక్కడ ఉన్న పలువురు కూడా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 270కి పెరిగింది. చాలా వరకు మృతదేహాలు కాలిపోయాయి. అందువల్ల మృతులను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 11 మందిని గుర్తించారు. మృతుల డీఎన్ఏ వారి బంధువులతో సరిపోల్చినట్లు ప్రభుత్వ వైద్యులు శనివారం తెలిపారు.
ఇప్పటి వరకు మరణించిన 11 మంది డీఎన్ఏ నమూనాలు సరిపోలాయని సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని.. ఈరోజు మరో రెండు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు. డీఎన్ఏ పరీక్ష నిదానంగా జరిగే ప్రక్రియ అని, జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ మానసిక క్షోభను ఎదుర్కొనేందుకు బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
డీఎన్ఏ నమూనాలను పరిశీలించి మృతులను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ (AFES) గత 24 గంటల్లో మేఘని నగర్ ప్రాంతంలోని ప్రమాద స్థలం నుండి కొన్ని శరీర భాగాలతో పాటు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలంలో విచారణలో ఫోరెన్సిక్, విమానయాన నిపుణులకు సహాయం చేస్తున్నారని అదనపు చీఫ్ ఫైర్ ఆఫీసర్ జయేష్ ఖాదియా తెలిపారు. క్యాంటీన్ శిథిలాల నుంచి శుక్రవారం కొన్ని శరీర భాగాలను వారు గుర్తించగా, శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది.
దెబ్బతిన్న క్యాంటీన్ భవనంపై విమానం టెయిల్ ఫిన్ ఇరుక్కుపోయిందని, దానిని కిందకు దించేందుకు క్రేన్ సాయం తీసుకుంటున్నామని ఖాదియా తెలిపారు. ఎయిరిండియా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, మేము భవనం నుండి టెయిల్ ఫిన్ను క్రిందికి తీసుకువచ్చే పనిని ప్రారంభిస్తాము' అని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే.. మృతుల కుటుంబీకులకు, క్షతగాత్రులకు రూ. 25 లక్షల మధ్యంతర చెల్లింపుతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.