భూకంపంతో వణికిపోయిన ఉత్తర భారతం

ఉత్తర భారత్‌లో భూప్రకంపణలు అలజడి సృష్టించాయి.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 10:35 AM GMT
afghanistan, earthquake, delhi,

 భూకంపంతో వణికిపోయిన ఉత్తర భారతం 

ఉత్తర భారత్‌లో భూప్రకంపణలు అలజడి సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా భూకంప తీవ్రత కనిపించింది. గురువారం మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు ప్రకటించారు అధికారులు. భూకంప కేంద్రం 192 కిలోమీటర్ల లోపల జరిగినట్లు గుర్తించారు. భూకంప తీవ్రత జమ్ముకశ్మీర్‌ నుంచి ఢిల్లీ వరకు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

భూకంప తీవ్రతకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయ్యినట్లు వెల్లడించారు అధికారులు. తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండటంతో.. చాలా చోట్ల భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో భూకంపం సమయంలో ఊగిపోయిన ఫ్యాన్లు.. ఇతర వస్తువులను ఫోన్లలో రికార్డు చేశారు. కొన్ని చోట్ల ఆఫీసుల్లో ఉన్న ప్రజలు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఆ వీడియోలు నెట్టింట ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇక భూకంపం ధాటికి ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఆస్తినష్టం జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

భూకంప కేంద్రం అప్ఘనిస్థాన్‌లో గురించింది పరిశోధన కేంద్రం. దక్షిణాసియాలోని ముఖ్యదేశాల్లో దీని ప్రభావం కనిపించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లా, దక్షిణ పీర్‌ పంజాల్‌ ప్రాంతం, పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కూడా దీని తీవ్రత కనిపించింది. నిన్న కూడా అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాలు ఎక్కువగా ఆసియా ఖండంలోనే నమోదు అవుతుంటాయి. భారత్‌లో అయితే జమ్ముకాశ్మీర్, ఇక పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, తజకిస్థాన్‌ ప్రాంతాల్లో భూంక కేంద్రాలు ఉంటాయి.




Next Story