'ఈ ఏడాది 9 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి ఓడిపోకూడదు'.. బీజేపీ నయా ప్లాన్‌

9 elections this year, should lose none: BJP chief JP Nadda at key executive meet. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్‌ పెట్టింది.

By అంజి  Published on  17 Jan 2023 4:05 AM GMT
ఈ ఏడాది 9 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి ఓడిపోకూడదు.. బీజేపీ నయా ప్లాన్‌

ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్‌ పెట్టింది. రానున్న రోజుల్లో జరిగే అన్ని అసెంబ్లీల ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్‌.. సోమవారం జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించిన విషయాలను విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో.. బిజెపి చీఫ్ జెపి నడ్డా ఈ ఏడాది తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోరాడాల్సి ఉందని, వీటిలో ఒక్కటి కూడా ఓడిపోకూడదని వివరించారని చెప్పారు. ''2023 సంవత్సరం చాలా ముఖ్యమైనదని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలి'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

''మనం బలహీనంగా ఉన్న బూత్‌లను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. అలాంటి 72,000 బూత్‌లను ఇంతకుముందు గుర్తించామని, ఇప్పటి వరకు 1.30 లక్షల బూత్‌లను బలోపేతం చేశామని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు'' అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ ఇటీవల ముగిసిన ఎన్నికలపై కూడా చర్చించారని, గుజరాత్ విజయం చారిత్రాత్మకమని, అపూర్వమని రవిశంకర్‌ ప్రసాద్ అన్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల గురించి నడ్డా మాట్లాడుతూ.. ప్రభుత్వాలను మార్చే సంప్రదాయాన్ని మార్చాలని అనుకున్నామని, అయితే అలా చేయలేకపోయామని అన్నారు. పార్టీలో సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యం, దాని నాయకత్వం గురించి కూడా నడ్డా మాట్లాడారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో, మొబైల్, కార్ల తయారీ, వందే భారత్ రైళ్లలో భారతదేశం దూసుకుపోవడం, ఆర్థిక పరంగా యూకేని ఆక్రమించడం వంటివి హైలైట్ చేయబడ్డాయి.

Next Story