14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామ‌ని బెదిరింపులు.. న‌గ‌రంలో హై అలర్ట్

ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్‌ వచ్చింది.

By Medi Samrat
Published on : 5 Sept 2025 2:41 PM IST

14 మంది ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్.. 34 వాహనాల్లో బాంబులు అమర్చామ‌ని బెదిరింపులు.. న‌గ‌రంలో హై అలర్ట్

ముంబై పోలీసులకు గురువారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. ఈ సందేశం అందిన వెంటనే పోలీసు శాఖలో భయాందోళనలు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ బెదిరింపు సందేశంలో 14 మంది ఉగ్రవాదులు ముంబైలోకి ప్రవేశించారని, వారు 400 కిలోల ఆర్‌డిఎక్స్‌తో పాటు 34 వాహనాల్లో బాంబులను అమర్చారని పేర్కొన్నారు.

ముఖ్యంగా గణేష్ ఉత్సవాల నిమ‌జ్జ‌నం సందడిలో ఉన్న‌ తరుణంలో ఈ సందేశం పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ బెదిరింపు మెసేజ్‌పై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ నుండి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) వరకు అన్ని ఏజెన్సీలు ఈ విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మెసేజ్‌లో ‘లష్కరే జిహాదీ’ అనే సంస్థ పేరు కూడా కనిపించింది. ఈ సంస్థ, సందేశం పంపిన వ్యక్తి గురించి పోలీసులు వెతుకుతున్నారు.

శనివారం గణేష్ ఉత్సవాల చివరి రోజు. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. దేవాలయాలు, మార్కెట్‌లు, రద్దీగా ఉండే ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూంబింగ్ ఆపరేషన్ అంటే ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సందేశంలో పేర్కొన్న 'లష్కరే జిహాదీ' గురించి పెద్దగా సమాచారం లేదు. ఇది నిజమైన సంస్థనా లేక ఎవరైనా బెదిరించేందుకే ఈ పేరు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు వాట్సాప్ మెసేజ్‌ని ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనే విషయాలను ఆరా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెక్నికల్‌ టీమ్‌లు ఈ విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి.

Next Story